అహోబిలంలో చూడవలసిన ప్రదేశాలు

అహోబిలం కర్నూలు జిల్లాలో వున్న ఆళ్లగడ్డ మండలం లోని ఒక ప్రసిద్ద గ్రామం. ఇక్కడ ప్రసిద్ది చెందిన “శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి” వారి ఆలయం వుంది. అహోబిల గ్రామం ఆళ్లగడ్డ నుండి 20 km మరియు నంద్యాల నుండి 60 km  దూరంలో వుంది. ఈ ప్రదేశంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంభువుగా బిలంలో వెలిశారు కాబట్టి దీనిని “అహోబిలం” అని పిలుస్తున్నారు. ఇక్కడ స్వామి వారు భక్తుల కోసం తొమ్మిది అవతారాలలో తొమ్మిది ప్రదేశాలలో వెలిశారుఅందువల్ల ఈ క్షేత్రాన్ని “నవనారసింహాక్షేత్రం” అని పిలుస్తారు. ఈ క్షేత్రం 108 దివ్య క్షేత్రాలలో ప్రముఖమైనది. రాక్షసుడు అయిన “హిరణ్యకశ్యవున్ని” సంహరించడానికితన భక్తుడైన ప్రహ్లాదున్ని రక్షించడానికి నరసింహ స్వామి వారు స్తంభము నందు ఉద్భవించిన స్థలమే ఈ అహోబిల క్షేత్రం. ఈ అహోబిల క్షేత్రం నల్లమల అడవుల్లో వుంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులను మరియు పర్యాటకులను ఆకర్శింపజేస్తుంది. వర్షాకాలంలో ఇక్కడి జలపాతదృశ్యాలు పర్యాటకుల్ని మంత్రముగ్ధులని చేస్తాయి. ఇప్పుడు మనం అహోబిలంలో చూడవలసిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

అహోబిలంలో చూడవలసిన ప్రదేశాలు :

1. జ్వాలా నరసింహ స్వామి ఆలయం
2. అహోబిల నరసింహ స్వామి ఆలయం (ఎగువ అహోబిలం, పెద్ద అహోబిలం)    
3. మాలోల నరసింహ స్వామి ఆలయం
4. క్రోద నరసింహ స్వామి ఆలయం (వరాహ నరసింహ స్వామి ఆలయం)
5. కారంజ నరసింహ స్వామి ఆలయం
6. భార్గవ నరసింహ స్వామి ఆలయం
7. యోగానంద నరసింహ స్వామి ఆలయం
8. క్షాత్రపత నరసింహ స్వామి ఆలయం (ఛత్రవట నరసింహ స్వామి ఆలయం)
9.  పావన నరసింహ స్వామి ఆలయం (పామిలేటి నరసింహ స్వామి ఆలయం)
10. ప్రహ్లాద బడి
11.  ఉగ్ర స్తంభం
12. దిగువ అహోబిలం (చిన్న అహోబిలం) మొదలైనవి

జ్వాలా నరసింహ స్వామి ఆలయం :

జ్వాలా నరసింహ స్వామి ఆలయం “అచలచయ యేరు” అని పిలువబడే ఒక కొండ పైన వుంది. ఈ ఆలయం ఎగువ అహోబిలం నుండి 4 km  దూరంలో వుంది. ఇక్కడే “ఉగ్ర నరసింహ స్వామి” రాక్షసుడైన హిరణ్యకశివున్ని వధించినట్లు చెపుతారు. స్తంభం నుండి ఉద్భవించిన నరసింహ స్వామి క్రోధాగ్ని జ్వాలలతో ఊగిపోతుండడంతో ఈ స్వామిని “జ్వాలా నరసింహ స్వామి” అని పిలుస్తున్నారు. ఇక్కడే “భవనాశని నది” ప్రారంభం అయ్యి జలపాతంగా దర్శనమిస్తుంది. ఈ నీటిలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడే “రక్త గుండం” అనే ఒక పుష్కరిణి వుంటుంది. అందులో ఎల్లప్పుడూ నీరు వుంటాయి, మరియు ఆ నీరు ఎర్రగా వుంటాయి ఎందుకంటే హిరణ్యకశపున్ని నరసింహ స్వామి వారు సంహరించిన తరువాత తన చేతులను ఈ పుష్కరిణిలోనే కడుక్కున్నారట. అందువల్లనే ఈ నీరు ఎర్రగా వుంటుంది.  

అహోబిల నరసింహ స్వామి ఆలయం ( ఎగువ అహోబిలం ) :

హిరణ్యకశివున్ని సంహరించిన తరువాత ముక్కోటి దేవతలు స్తోత్రము చేసిన కోపము తగ్గని నరసింహ స్వామి ప్రహ్లాదుడు తపస్సు చేయగా, ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి “శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి” వారు స్వయంభువుగా ఈ ప్రదేశంలోనే బిలంలో వెలిశారు. అందువల్ల ఈ స్వామిని “అహోబిల నరసింహ స్వామి” అని పిలుస్తున్నారు.

మాలోల నరసింహ స్వామి ఆలయం :

మాలోల నరసింహ స్వామి ఆలయం అహోబిలం నుండి 1 km దూరంలో వుంది. ఈ ఆలయం వేదాద్రి పర్వతం మీద వుంటుంది. “మా” అనగా “లక్ష్మీ” అని మరియు “లోల” అనగా “ప్రియుడు” అని అర్థం, అంటే “లక్ష్మీదేవికి ప్రియమైన నరసింహ స్వామి” అని దీని అర్థం. ఈ స్వామిని పూజించిన వారికి శుక్ర గ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుందట.  

క్రోద నరసింహ స్వామి ఆలయం (వరాహ నరసింహ స్వామి ఆలయం) :

వేదాద్రి పర్వతం నందు వేదములను, భూదేవిని “సోమకాసురుడు” అపహరించు కొని పోగా “వరాహ నరసింహ స్వామి” సోమకాసురున్నీ సంహరించారు. అందువల్ల ఈ క్షేత్రానికి “వరాహ నరసింహ స్వామి క్షేత్రం” అని పేరు. ఈ స్వామిని దర్శించిన వారికి రాహు గ్రహ దోషాలు తొలిగిపోతాయి.

కారంజ నరసింహ స్వామి ఆలయం :

కారంజ వృక్షము క్రింద పద్మాసనంలో వేంచేసియున్న స్వామిని కారంజ నరసింహ స్వామి అని పిలుస్తున్నారు. ఇక్కడ స్వామి వారు ఆదిశేషుని పడగల క్రింద ధ్యాన నిమగ్నుడై వున్నారు. “గోబిలిడు” అనే మహర్షి తపస్సు చేసినందుకు ఆయనకు నరసింహ స్వామి వారు ఇక్కడ ప్రత్యక్ష మయ్యారట. ఈ స్వామికి పాలనేత్రం ( త్రినేత్రం ) కలదు, అందుకే అన్నమయ్య “పాలనేత్రానల ప్రబల విధ్యులత కేళి విహార లక్ష్మీనరసింహ” అని పాడారు. ఈ స్వామిని దర్శించి పూజించిన వారికి చంద్ర గ్రహ అనుగ్రహం లభించును.

భార్గవ నరసింహ స్వామి ఆలయం :

పరశురాముడు తపస్సు చేయగా “శ్రీ నృసింహ స్వామి” వారు హిరణ్యకశిపున్ని సంహారం చేసే స్వరూపంగా దర్శనమిచ్చారు. కావున ఈ క్షేత్రానికి “భార్గవ నరసింహ స్వామి క్షేత్రం” అని పేరు. ఈ స్వామిని “భార్గోటి” అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం దిగువ అహోబిలానికి 2 km దూరంలో వుంది. ఈ స్వామి వారిని దర్శించిన వారికి సూర్య గ్రహ అనుగ్రహం లభించును.

యోగానంద నరసింహ స్వామి ఆలయం :

ఈ ఆలయం దిగివ అహోబిలం నుండి 3 km దూరంలో వుంది. ఈ ప్రదేశం యోగులకు మరియు దేవతలకు నిలయం. యోగము నందు ఆనందమును ప్రసాదించుచున్నారు కాబట్టి ఇక్కడి స్వామి వారికి “యోగానంద నరసింహ స్వామి” అని పేరు. ప్రహ్లాదుడు ఈ యోగా నృసింహ స్వామి వారి అనుగ్రహంతో యోగాభ్యాసం చేసినాడట. ఈ స్వామి వారిని పూజించిన వారికి శని గ్రహ అనుగ్రహం లభించును. ఈ ప్రదేశంలోనే “శ్రీ కాశిరెడ్డి నాయన ఆశ్రమం” కూడా  వుంది మరియు ఇక్కడ ఒకే చోట నవనారసింహులను దర్శించవచ్చు.   

క్షాత్రపత నరసింహ స్వామి ఆలయం (ఛత్రవట నరసింహ స్వామి ఆలయం) :

ఈ ఆలయం దిగువ అహోబిలం నుండి 3 km దూరంలో వుంది. “హాహా” మరియు “హుహ్వా” అను ఇద్దరు గంధర్వులు గానం చేసి నృత్యం చేయగా స్వామి వారు సంతోషించి వారికి శాప విమోచనం చేశారట. కిన్నెర, కింపుర, నారదులు ఈ క్షేత్రంలో గానం చేశారట. సంగీతాన్ని ఆస్వాదించుచున్నట్లు వుండే ఈ స్వామిని “ఛత్రవట నరసింహ స్వామి” అని పిలుస్తున్నారు. ఈ స్వామిని పూజించిన వారికి కేతు గ్రహ అనుగ్రహం లభించును.

పావన నరసింహ స్వామి ఆలయం (పామిలేటి నరసింహ స్వామి ఆలయం) :

ఈ పరమపావనమైన ప్రదేశంలో ఏడడుగుల ఆదిశేషుని క్రింద స్వామి వారు వెలసి వున్నారు. భరద్వాజ ఋషి ఇక్కడ తపస్సు చేయగా స్వామి వారు మహాలక్ష్మీ సహితంగా దర్శనమిచ్చారు. కావున ఈ స్వామిని “పావన నరసింహ స్వామి” అని పిలుస్తున్నారు. అంతే కాకుండా ఈ స్వామిని “పాములేటి నరసింహ స్వామి” అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం ఎగువ అహోబిలం నుండి 6 km దూరంలో వుంది. ఈ స్వామిని దర్శించితే చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ స్వామిని పూజించిన వారికి బుధ గ్రహ అనుగ్రహం లభించును. ఈ ఆలయానికి సమీపంలో చెంచు లక్ష్మీ అమ్మవారి గుహ వుంటుంది.

ప్రహ్లాద బడి :

ఇది ఒక చిన్న గుహ దీనికి ఎదురుగా కొండలపై నుండి నీరు పడుతూ చాలా అందంగా వుంటుంది మరియు ఈ గుహకు ఎదురుగా విశాలమైన ప్రదేశం వుంటుంది, అక్కడ రకరకాల అక్షరాలు వ్రాసినట్టు గీతలు వుంటాయి. అందువల్లనే దీనిని ప్రహ్లాద బడి అని పిలుస్తున్నారు. ఈ ప్రహ్లాద బడి నుండి ప్రవహించే నీరు వర్షాకాలంలో పెద్ద జలపాతాలను కల్పిస్తుంది.  

ఉగ్ర స్తంభం :

ఇది అహోబిలంలోని ఎత్తైన ప్రదేశంలో వున్న కొండ మీద వుంది. ఈ కొండను దూరం నుండి చూస్తే ఒక రాతి స్తంభంలాగా కనిపిస్తుంది. దీని నుండే నరసింహ స్వామి వారు ఉద్భవించారని ప్రతీతి. ఈ ప్రదేశాన్ని చేరుకోవడం కొంచెం కష్టం. ఈ కొండ మీద శ్రీ నరసింహ స్వామి వారి పాదాలు వుంటాయి. జ్వాలా నరసింహ స్వామి ఆలయానికి సమీపంలో ఈ ప్రదేశంనకు చేరుకోవడానికి కావలసిన మార్గం వుంటుంది.

దిగువ అహోబిలం (చిన్న అహోబిలం) :

దిగువ అహోబిలంలోని “శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం” విజయనగర శిల్పసాంప్రదాయంతో అలరారుతుంటుంది. శ్రీ కృష్ణ దేవరాయలు దిగ్విజయ యాత్రా చిహ్నంగా వేయించిన “జయ స్తంభాన్ని” ఇక్కడ దర్శించవచ్చు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారు తన కళ్యాణానికి ముందు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సుల కోసం అహోబిలం వచ్చినట్లు ఒక కథనం. ఎగువ అహోబిలంలో నరసింహ స్వామి వారు ఉగ్ర రూపంలో వుండడంతో దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరదుడైన లక్ష్మీ నరసింహున్ని శాంత మూర్తిగా వేంకటేశ్వర స్వామి వారే ప్రతిష్టించినట్లు చెపుతారు. దీనికి సాక్ష్యంగా ప్రధాన ఆలయానికి దక్షిణంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం మనకు దర్శనమిస్తుంది. అహోబిల నరసింహ స్వామి వారు తన పెళ్ళికి తానే స్వయంగా భక్తులను ఆహ్వానిస్తానని అన్నారట. అందువల్ల 600 సంవత్సరాల క్రితం నాటి నుండి ఈ నాటి వరకు పార్వేట ఉత్సవాలు ఘనంగా 45 రోజుల పాటు జరుపుతారు.
అహోబిలంలో వసతి సౌకర్యాలు అంతగా అందుబాటులో లేవు. అయినప్పటికీ ఇక్కడ TTD వారి అతిథి గృహం మరియు అహోబిల మఠం అందుబాటులో వున్నాయి. ఇంకా మీకు సమీపంలోని ఆళ్లగడ్డలో రూమ్స్ అందుబాటులో వుంటాయి.  

ఇతర ప్రదేశాలు :

పావన నరసింహ స్వామి ఆలయం నుండి జ్యోతి క్షేత్రానికి నడక మార్గం వుంది. కేవలం స్థానికులకు మాత్రమే ఈ మార్గం గురించి తెలుసు. మీరు ఈ జ్యోతి క్షేత్రంలో గురుడాద్రి, శ్రీ కాశిరెడ్డి నాయన గారి సమాధి మరియు జ్యోతి నరసింహ స్వామి వారి ఆలయాలను దర్శించవచ్చు. 

ఎలా చేరుకోవాలి ?

రోడ్డు మార్గం :  ఇక్కడి సమీపంలోని పట్టణం ఆళ్లగడ్డ. అందువల్ల మీరు ఆళ్లగడ్డ చేరుకుంటే అక్కడి నుండి అహోబిలంనకు బస్సు సౌకర్యం కలదు. ఈ ఆళ్లగడ్డకు కడప, నంద్యాల నుండి బస్సు సౌకర్యం వుంది.
రైలు మార్గం : ఇక్కడి సమీపంలోని రైల్వే స్టేషన్ నంద్యాల 60 km.  
విమానాశ్రయం :సమీపంలోని విమానాశ్రయాలు కడప, కుర్నూలు. ఇంకా మీకు ఏమైనా సమాచారం కావలసి వుంటే కింద కామెంట్ చేయండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు